బీసీ కులగణన సర్వే చారిత్మ్రాకం కాంగ్రెస్ హైకమాండుకు మంత్రి కొండా సురేఖ లేఖ
సీఎం, పీసీసీ చీఫ్ నేతృత్వంలో సర్వే విజయవంతం
జాతీయ నేతల సహకారం మరువలేనిదని సురేఖ వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన బీసీ కులగణన సర్వే చారిత్మ్రాకం అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఒక బీసీ బిడ్డగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆమె గురువారం కాంగ్రెసు హైకమాండు లేఖలు రాశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎల్ఓపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీలకు వేర్వేరుగా లేఖలు రాశారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్రంలో బీసీ కులగణన కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిందని వివరించారు. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా శ్రమించారని చెప్పారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని బీసీలకు మరింత న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్న మేరకు ఈ హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని పునరుద్ఘాటించారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చిత్తశుద్ధితో, శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేశామన్నారు.
స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లకి కులాల లెక్కకు ఒక రూపం దొరికిందని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో బీసీలకు మరిన్ని ప్రభుత్వ ఫలాలు అందుతాయని ఆమె చెప్పారు.