బీసీల రీ సర్వేకు దిగివచ్చిన ప్రభుత్వం శాస్త్రీయంగా పలు సూచనలతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
కులగణన సర్వే అశాస్త్రీయంగా జరిగిందని, తప్పులతడకగా ఉందని తమ పార్టీ లెక్కలతో సహా నిరూపించడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి రీసర్వేకు అంగీకరించడాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్వాగితించారు.ఈసారైనా ఎన్యూమరేట్స్ ఇంటింటికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించాలని, వాటన్నింటిని క్రోడీకరించి సరైన లెక్కలు వెల్లడించాలని ఒక ప్రకటనలో ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఓబీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ కల్పించడంతో పాటు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నదని.. రాష్ట్ర ఏర్పాటు జరిగిన తొలినాళ్లలోనే ఈమేరకు మహానేత కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం చేయించడాన్ని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.బీఆర్ఎస్ చేసిన తీర్మానానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని ప్రధాని నరేంద్రమోడీ వద్దకు తీసుకెళ్లి చట్టసభల్లో 33%, స్థానిక సంస్థల ఎన్నికలలో 42 రిజర్వేషన్స్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ఎంపీ వద్దిరాజు కోరారు.అలాగే,ఓబీసీల సమగ్రాభివృద్ధికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేయాలని సలహానిచ్చారు.మంత్రిమండలిలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలలో నాలుగింటిని బీసీలకిచ్చి ప్రాధాన్యత శాఖలు కేటాయించాలని ఎంపీ వద్దిరాజు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు.