వారి ఖాతాల్లోకి రూ.20 వేలు, మంత్రి నిమ్మల రామానాయుడు
ఏపీలోని రైతులు, మత్స్యకారులకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త వినిపించనుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ తరుఫున మంత్రి నిమ్మల రామనాయుడు ప్రచారం చేస్తున్నారు. ఆదివారం పాలకొల్లులో ప్రచారం నిర్వహించిన మంత్రి నిమ్మల.. రాజశేఖర్ విజయం కోసం అందరూ కృషి చేయాలని టీడీపీ శ్రేణులను కోరారు. మండలిలో ఎన్డీఏ కూటమికి మెజార్టీ ఇవ్వాలని గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు.. మత్స్యకార భరోసా, అన్నదాత సుఖీభవ పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సముద్రంలో చేపల వేటను నిషేధించిన సమయంలో మత్స్యకారుల జీవన భృతి కోసం రూ.20 వేలు అందిస్తామని నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి మత్స్యకారులకు రూ.20 వేలు అందజేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. అలాగే మే నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అలాగే జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి వందనం అమలు చేస్తామని మంత్రి రామానాయుడు తెలిపారు. తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15000 చొప్పున అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది.
మరోవైపు వచ్చే ఐదేళ్లలో ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వం ప్రాధాన్యమని.. అదే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీపై సంతకం చేశారని గుర్తుచేశారు మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందన్న మంత్రి.. ఎన్నికలు ముగియగానే డీఎస్సీ విడుదల చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయ పోస్టులకు నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.