పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టాలని, దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని, పంచాయతీరాజ్ ఎన్నికలలో బి.సి లకు 42% కేటాయించాలని, దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. భువనగిరి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ…
అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆఘ-మేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు పెట్టారు. కాని బి.సి లకు చట్ట సభలలో రిజర్వేషన్లు పెట్టాలని 30 సం.రాలుగా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ దేశంలో బి.సి లను బిచ్చగాళ్ళను చేశారని విమర్శించారు. బి.సిలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండ గొర్రెలు – బర్రెలు –పందులు – పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని బి.సిలను శాశ్వత బిచ్చగాళ్ళను చేస్తున్నారని విమర్శించారు.
చివరకు కులగణన చేసి బీసీల జనాభా కూడా లెక్కించడానికి ఈ అగ్రకుల ప్రభుత్వాలకు మనసు రావడం లేదు. లెక్కలు తీస్తే రిజర్వేషన్లు పెంచవలసి వస్తుందని భయపడుతున్నారు. ప్రజలకు, కుక్కలకు, ఇతర జంతువులకు లెక్కలు ఉన్నవి కానీ బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కలు లేవన్నారు. బీసీలకు కేంద్రస్థాయిలో ఒక్క స్కీము కూడా లేదు. కాలేజీ కోర్సుల్లో చదివే విద్యార్థులకు ఫీజులు కూడా మంజూరు చేయడం లేదు.
భారతదేశం అగ్ర దేశంగా తయారవుతుందని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు చదువుకునే పేద పిల్లలకు ఫీజులు కూడా కట్టే స్థితిలో లేదన్నారు. రాజ్యాంగ రచన సమయంలోనే బి.సిలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో రిజర్వేషన్లు పెడితే ఎంతో ప్రగతి జరిగేది. కులతత్వం కనీస స్థాయికి వచ్చేది. బి.సిలకు ఏయే రంగాలాలో అన్యాయం జరిగిందో చూద్దాం.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలి. కానీ మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచిపెట్టారు. ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకు, అన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారు. కానీ మనదేశంలో పీడిత కులాలను ఇంకా అంది వేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, వార్డు మెంబర్లలో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం కు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50శాతం సీలింగ్ అని చెప్పి పెంచకుండా తప్పించుకోవడానికి వీలులేదు. ఇప్పటికే అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టి 50 శాతం సీలింగ్ పై పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసింది. అగ్ర కులాలకు రిజర్వేషన్లు పెంచడానికి మూడు రోజులలో లోక్ సభ, రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి సంతకం చేశారు. కాని 50 శాతం జనాభా గల బీద కులాలకు రాజ్యాంగ సవరణ చేయరా! మన దేశంలో ఇదేమి న్యాయమని ప్రశ్నించారు. అసెంబ్లీలో చట్టం చేసి 42 శాతం పెట్టవచ్చని ఆర్. కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. అవసరమైతే అన్ని పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నా యున్నవి. పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రామస్థాయి నుంచి ఉద్యమిస్తామని తెలిపారు.