మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన.. అదనపు కలెక్టర్ డి. వేణు.
పెద్దపల్లి జిల్లాలో మాదకద్రవ్యాలను నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు,మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు.అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ..విద్యా సంస్థలలో యాంటి డ్రగ్స్ కమిటీల ఏర్పాటు చేయాలని, డ్రగ్స్,ఇతర మాదకద్రవ్యాలు అలవాటు ఉన్న వారిని గుర్తించి వారిని పునరావాస కేంద్రాల ద్వారా అలవాటు మానిపించాలని అన్నారు. విద్యా సంస్థల్లో నిర్వహించే పేరెంట్ టీచర్స్ సమావేశాలలో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు,డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారితే వచ్చే పరిణామాలు, మాదకద్రవ్యాల బానిసత్వం నివారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ మొదలగు అంశాలను వివరించాలని,పేరెంట్స్ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందజేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.
డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాల పై అవగాహన వివరిస్తూనే సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని,మాదక ద్రవ్యాల రవాణా,సాగు,వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో గంజాయి తో పాటు గుడుంబా నివారణకు సైతం అవసరమైన చర్యలు కచ్చితంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలనీ వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. గోదావరిఖని ఆసుపత్రిలో 10 పడకల డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరమైన వారికి ఇక్కడ చికిత్స అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.జిల్లా లోని ఆసుపత్రులు,మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని అదనపు కలెక్టర్ డ్రగ్ ఇన్స్ పెక్టర్ కు సూచించారు.చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని,ఆలోచనా విధానం,ఆలోచనా శక్తి నశిస్తాయని అన్నారు. భావితరాలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియ జేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ రోడ్డు భద్రత ప్రమాణాల పై అవగాహన కల్పన, బర్డ్ ఫ్లూ బ్రదర్ అంశాలపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించే పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి జి. క్రిష్ణ, గోదావరిఖని ఏసీపీ ఏం.రమేష్,జిల్లా అటవీ అధికారి శివయ్య,జిల్లా ఆప్కారి శాఖ అధికారి మహిపాల్ రెడ్డి,కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రకాష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.