డిసెంబర్ 15, 16న రెండు సెషన్స్ లలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహణ..
— పరీక్షా సమయం ముగిసే వరకు హాల్ విడిచి ఎవరూ బయటికి వెళ్ళవద్దు..
–28 వేల 101 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు జిల్లాలో 85 పరీక్షా కేంద్రాలు సిద్ధం — గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్-
ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 11 సమర శంఖమ్ :-
జిల్లాలో ఎటువంటి పొరపాట్లు లేకుండా పక్కాగా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అధికారులకు అన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, గ్రూప్ -2 పరీక్షా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 15, 16 తేదీలలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5-30 వరకు రెండు సెషన్ లలో గ్రూప్ 2 పరీక్షలు సజావుగా జరిపేందుకు ఏర్పాట్లు పక్కాగా జరగాలని అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. ఖమ్మం జిల్లాలో 28 వేల 101 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలకు హాజరయ్యేందుకు జిల్లాలో మొత్తం 85 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశామని, ఇద్దరు రీజనల్ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో 85 పరీక్షా కేంద్రాలు పని చేస్తాయని అన్నారు. విజయ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. చిన్నయ్య రీజినల్ కోఆర్డినేటర్ -1గా 40 పరీక్షా కేంద్రాలు, ఎస్.బి.ఐ.టి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. రాజకుమార్ రీజనల్ కోఆర్డినేటర్- 2గా 45 పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తారని అన్నారు.జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్ పని చేస్తుందని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రశ్న పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు వీలుగా ఎంపిడిఓ లను జాయింట్ రూట్ అధికారులుగా, ప్రతి 3 నుంచి 5 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు తహసీల్దారులను ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులుగా నియమించామని అన్నారు.ప్రశ్నా పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. డిసెంబర్ 14న పరీక్షల నిర్వహణ పై పరీక్షా కేంద్రాల వారిగా చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ లు సమావేశాలు నిర్వహించుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఒకరోజు ముందు పరీక్ష కేంద్రం పరిసరాలను చీఫ్ ఇన్విజిలేటర్ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.పరీక్షా కేంద్రం కాంపౌండ్ వాల్ దగ్గర కిటికీలు, చెట్లు ఏవైనా ఉన్నాయా పరిశీలించాలని, ఎట్టి పరిస్థితులలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.
పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను ఉదయం సెషన్ లో 8-30 నుంచి, మధ్యాహ్నం సెషన్ లో 1-30 నుంచి అనుమతించడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల గేటు ఉదయం సెషన్ లో 9-30 గంటలకు, మధ్యాహ్నం సెషన్ లో 2-30 గంటలకు మూసి వేస్తామని, దీని తర్వాత పరీక్ష కేంద్రాల లోనికి ఎవరిని అనుమతించడం జరగదని, ఈ అంశాన్ని అభ్యర్థులకు చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.పరీక్షలు ప్రారంభమైన తర్వాత పరీక్ష కేంద్రాన్ని వదిలి ఎవరూ వెళ్ళకూడదని అన్నారు. గ్రూప్ పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ అవసరమైన మౌళిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాల ఏర్పాటు చేయాలని, అంతరాయం లేని విద్యుత్ సరఫరా కు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి, సకాలంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడాలని అదనపు కలెక్టర్ తెలిపారు.అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చే సమయంలో చెక్ చేసేందుకు అవసరమైన స్టాఫ్ ఏర్పాటు చేయాలని, మహిళా అభ్యర్థులను చెక్ చేసేందుకు ప్రైవసీ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలో హాల్ నెంబర్లకు మార్గం తెలిసేలా డైరెక్షన్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ఒకరోజు ముందు వెళ్లి చెక్ చేసేలా ప్రచారం చేయాలని, పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు క్యాలిక్యులేటర్, సెల్ఫోన్, పెన్ డ్రైవ్, బ్లూ టూత్ డివైజెస్, జ్యూవెలరీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్, మొదలగు సామాగ్రి తీసుకుని రావడానికి వీల్లేదని, చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని , షూస్ వేసుకోవద్దని, అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫై చేయాలని అన్నారు. అభ్యర్థుల వివరాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు వచ్చాయని, వాటిని సరైన అభ్యర్థులకు అందేలా చూడాలని అన్నారు.పోలీస్ బందోబస్తుతోనే ప్రశ్నా పత్రాల తరలింపు ఉండాలని అదనపు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీవోలు జాయింట్ రూట్ అధికారులుగా వ్యవహరించాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, ఏసీపీ ఎన్. నర్సయ్య, రీజినల్ కో ఆర్డినేటర్ లు డా. వి. చిన్నయ్య, డా. జి. రాజ్ కుమార్, జిల్లా వైద్య శాఖ అధికారి బి. కళావతి బాయి, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ లు, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, రవాణా శాఖ, పోలీస్ అధికారులు, మునిసిపల్ అధికారులు, ఎంపీడీఓ., తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.