తెలంగాణలో జాతీయ విపత్తు స్పందన దళం తరహాలో రాష్ట్ర విపత్తు స్పందన దళం రంగం అందుబాటులోకి రానుంది. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భారీ అగ్నిప్రమాదాలు, వరదలు, భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయ చర్యలు చేపట్టడానికి ఈ దళం అన్ని వేళలా సిద్ధంగా ఉంటుంది. తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది సిబ్బందితో ఇది ఏర్పాటు కానుంది. అగ్నిమాపకశాఖలోని *ఫైర్ స్టేషన్ లు ఇక నుంచి ఎస్డీఆర్ఎఫ్ స్టేషన్లుగా మార్పు చెందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 137 ఫైర్ స్టేషన్ లలోని దాదాపు వెయ్యి మంది సిబ్బందితో పాటు తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన పది కంపెనీలతో కూడిన 1000 మంది సిబ్బంది ఈ దళంలో విధులు నిర్వర్తించనున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కోసం కొత్తగా 20 బస్సులు, ట్రక్కులు, బొలేరోలతో పాటు 40 వాటర్ బోట్లు కొనుగోలు చేశారు. కాగా వీటన్నిటిని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అగ్నిప్రమాదాల్లో సహాయ చర్యల కోసం సిబ్బందికి శిరస్త్రాణాలు, చేతి గ్లౌజ్లు, కంటి అద్దాలు, రెఫ్లెక్టివ్ టేప్లు, సేఫ్టీషూ, మెడికల్ ఫస్ట్ రెస్పాండర్కిట్లను కూడా సమకూర్చారు.
తెలంగాణ విపత్తు నిర్వహణ దళంను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Published On: December 6, 2024 7:08 pm
