ఆన్లైన్ యాప్కు ఆకర్షితులై రూ.లక్షల్లో పోగొట్టుకున్న అమాయకులు
కోస్టా యాప్లో పెట్టుబడి పెడితే మూడు నాలుగింతలు ఎక్కువ పైసలిస్తామంటూ రూ.కోట్లు కొల్లగొట్టిన విషయం *జనగామ* జిల్లాలో వెలుగు చూసింది. మోసపోయామని గ్రహించిన సుమారు 50 మంది బాధితులు శనివారం జనగామ పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కారు. జనగామ ఏసీపీ నితిన్ చేతన్ పాందేరీ వివరాలు తెలుసుకున్నారు.
*జనగామకు* చెందిన కొందరు వ్యక్తులు గత డిసెంబర్ నెలలో జనగామ జిల్లాలోని ఓ పెద్ద ఫంక్షన్ హాల్లో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు *500* మంది హాజరైనట్లు సమాచారం. వీరికి యాప్ ప్రతినిధులు కోస్టా యాప్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు ఉంటాయని వివరించారు తక్కువ పెట్టుబడితో లక్షాధికారు అవుతారని నమ్మించారు.
దీనికి ఆకర్షితులైన కొందరు ఈ యాప్ను వినియోగించిన మొదట్లో కొంచెం రిటర్న్స్ రావడంతో ఆ విషయాన్ని మరికొందరికి చెప్పారు. ఇలా ఒకరి నుంచి ఒకరికి విషయం పాకి ఇంకేముంది వేలాది మంది యాప్ను డౌన్లోడ్ చేసుకుని పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. మొదట్లో కొంచె రిటర్న్స్ ఇవ్వడంతో యాప్ను పూర్తిగా నమ్మిన కొందరు రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టారు.
ఇలా కోట్లాది రూపాయలు యాప్లో జమ అయ్యాక సంక్రాంతి పండుగకు ముందు యాప్ ఒక్కసారిగా ఆగిపోయింది. కోస్టా యాప్లో పెట్టుబడులు పెడుతూ వస్తున్న వారికి ఒక్కసారిగా ఆ యాప్ ఆగిపోవడంతో గుండె ఆగినంత పనైంది. అప్పటికే లక్షల్లో పెట్టుబడులు పెట్టిన వారు ఎందరో ఉన్నారు.
మోసపోయిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, టీచర్లు, పలువురు అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. *సిద్దిపేట* జిల్లాలో ఆరువేల మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు