మాతో పెట్టుకుంటే నిప్పుతో గేమ్స్ ఆడటమే.. కేంద్రానికి డిప్యూటీ సీఎం ఉదయనిధి

కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య హిందీ వివాదం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా, త్రిభాషా విధానంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తాము ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నామని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. అంతేకాదు, తమిళనాడుతో పెట్టుకోవడమంటే నిప్పుతో చెలగాటమాడినట్టేనని స్పష్టం చేసింది. భాష, జాతి స్పృహ వచ్చిన తర్వాతే తమిళులకు రాజకీయాలు వచ్చాయని ఈ మేరకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి హెచ్చరికలు చేశారు. .

 

 

‘‘మా నడుముకు సిద్ధాంతం అనే పంచె వచ్చిన.. తర్వాతే భుజాన పదవి అనే కండువా వచ్చింది.. ఆర్థిక హక్కు కోరితే హిందీని అంగీకరించాలని తమిళనాడును బెదిరించడం ఎంతవరకు సమంజసం.. తమిళనాడును రెచ్చగొట్టడం నిప్పుతో చెలగాటమాడటంతో సమానం.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చరిత్ర చూస్తే అది మీకు అర్థం అవుతుంది… అనేక రాష్ట్రాల కలయికతో ఏర్పడేదే కేంద్ర ప్రభుత్వం.. మా పిల్లల చదువు కోసం నిధినే తాము అడుగుతున్నాం.. మీరు ఇచ్చేవాళ్లు మేము పుచ్చుకునే వాళ్లమని భావించి అహంకారం ప్రదర్శించవద్దు… తమిళనాడు దీన్ని సహించదు’’ అని ఉదయనిధి ఘాటుగా తెలిపారు.

ఇదే అంశంపై ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం ఎక్స్‌ (ట్విట్టర్)లో తీవ్రంగా స్పందించారు. గర్వంగా మాట్లాడితే తమిళుల విశ్వరూపాన్ని ఢిల్లీ చూడాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ‘భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలి’ అనే కేంద్ర మంత్రి (ధర్మేంద్ర ప్రధాన్‌) త్రిభాషా సూత్రాన్ని ‘రూల్‌ ఆఫ్‌ లా’ అంటున్నారు.. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరి చేస్తుందో మంత్రి చెప్పగలరా?’ అని స్టాలిన్ ప్రశ్నించారు.

ఇండియా అనేది రాష్ట్రాల యూనియన్‌, ఉమ్మడి జాబితాలో విద్య ఉందని, దానికి కేంద్రం గుత్తాధిపత్యం కాలేదని స్పష్టం చేశారు. త్రిభాషా సూత్రాన్ని ఆమోదించే వరకు తమిళనాడుకు నిధులు ఇవ్వబోమని బెదిరింపులకు పాల్పడుతోన్న కేంద్రమంత్రి వైఖరిని తమిళులు సహించరని ఉద్ఘాటించారు ‘మా హక్కుల గురించి మేము అడుగుతున్నాం.. ఏదో మీ వ్యక్తిగత ఆస్తిని కోరినట్టు గర్వంగా మాట్లాడితే తమిళుల విశ్వరూపాన్ని ఢిల్లీ చూడాల్సి ఉంటుంది’ అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment