ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 16 (సమర శంఖమ్) :-
ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఖమ్మం మదీన మసీదు అధ్యక్షుడు ఎం.డి. హకీం ముస్తఫా నగర్ ఏరియాలోని మైనారిటీలకు ఖబరస్తాన్ ఏర్పాటుకు భూమి కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం అర్బన్ తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన చింతలపాటి చెన్నారావ్ మన ఊరు మన బడి పథకం క్రింద తల్లాడ మండలం కుర్నవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 45 లక్షల విలువ గల పనులు చేశానని, అందులో 10 లక్షల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, త్వరగా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా విద్యా శాఖ అధికారికు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన కృష్ణవేణి వల్లభి గ్రామం నందు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఖాళీ అయినందున ఎస్టి కులస్తురాలైన తనకు అవకాశం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా సంక్షేమ అధికారికి రాస్తూ నిబంధనల ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.తల్లాడ గ్రామానికి చెందిన ఈలప్రోలు అంజలి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా, ఈఈ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ ప్రజావాణిలో డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్వో ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, జిల్లా అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.