మంథని: మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్
మంథని, మార్చి19, సమర శంఖం ప్రతినిధి:-వరంగల్- మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బుష్ క్లియరెన్స్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, అడవి సోమన పల్లి గ్రామంలో నిర్మాణం అవుతున్న ఇందిరమ్మ ఇండ్లు, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జాతీయ రహదారి ప్యాకేజీ 1 లో భాగంగా మంత్రి మండలం పుట్టపాక వరకు ట్రెంచ్ కటింగ్ పనులు పూర్తి చేశామని, రోడ్డు అలైన్మెంట్ లోపల రోడ్డు వేసేందుకు వీలుగా పిచ్చి మొక్కలు తొలగించాలని, బుషెస్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.
మంథని డివిజన్ పరిధిలో కార్యాలయాల సముదాయం నిర్మించుకునేందుకు వీలుగా అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చేపట్టిన రేనోవేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. పెద్దపల్లి నుంచి మంథని ప్రాంతానికి గైనకాలజిస్ట్ ను కేటాయించడం జరిగిందని, మంథని మాతా శిశు ఆసుపత్రిలో ఈ నెల 22 నుంచి ఈ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులో ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు.
అడవి సోమన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు పంపిణీ చేసిన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు జి. మంజులతో ఇంటి నిర్మాణం పై కలెక్టర్ చర్చించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ యాప్ లో నమోదు చేస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
అడవి సోమన్ పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థికి తెలుగు, ఆంగ్లం చదవడం రాయడం, కనీస గణిత సామర్థ్యం ఉండేలా ఉపాధ్యాయులు పని చేయాలని అన్నారు.
ఈ పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ వెంట మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, ఇంచార్జి తహసిల్దార్ గిరి, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.