పోసానికి అస్వస్థత, ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
పవన్ కళ్యాణ్ ని అనుచిత వ్యాఖ్యలపై అరెస్టైన ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో సబ్ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోసానికి చికిత్స అందిస్తున్నారు. గత రాత్రి నుండి పోసాని ఛాతీలో నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, పోసాని కృష్ణ మురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. గురువారం రాత్రి 9 గంటలకు పోలీసులు కృష్ణ మురళిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. పదేళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ పోసాని చేసిన వ్యాఖ్యలపై స్థానిక జనసేన నేత ఫిర్యాదు మేరకు ఆయనపై అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోసాని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లను ప్రస్తావిస్తూ, ఈ సెక్షన్లు ఆయనకు వర్తించవని వివరించారు. సంబంధం లేని సెక్షన్లతో పాటు అనవసర సెక్షన్లు పెట్టారని వాదించారు. ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబంధించి తమ వాదనలు వినిపించారు. దాదాపు 9.30 గంటలకు ప్రారంభమైన వాదనలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు ఆలకించిన మెజిస్ట్రేట్ సాయితేజ్.. తెల్లవారుజామున పోసానికి 14 రోజుల రిమాండును విధించారు. అనంతరం పోసానిని రైల్వేకోడూరు సీఐ పి.వెంకటేశ్వర్లు, ఓబులవారిపల్లి ఎస్ఐ పి.మహేష్నాయుడులు తమ సిబ్బందితో ఉదయం 7.52 గంటలకు నేరుగా రాజంపేట సబ్ జైలు వద్దకు తీసుకొచ్చారు.