పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయని మెస్సేజ్.. ఓపెస్ చేస్తే రూ.2 లక్షలు కట్.. మీరూ ఇలా చేయకండి.

ఏ చిన్న అవకాశం దొరికినా సైబర్ మోసగాళ్లు వదిలిపెట్టట్లేదు. పండగకు బంపర్ ఆఫర్ అంటూ మొదలుపెట్టి.. ప్రభుత్వ పథకాల వరకూ ప్రజలను మోసం చేసే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలట్లేదు. తాజాగా.. హైదరాబాద్‌కు చెందిన ఓ 53 ఏళ్ల వ్యక్తి ఫోన్‌కు వచ్చిన పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన లింకు క్లిక్ చేస్తే.. ఏకంగా 1.9 లక్షలు పోగొట్టుకున్నాడు. ఓల్డ్ సఫిల్‌గూడలో నివాసముండే ఓ ప్రైవేట్ ఉద్యోగికి.. పీఎం కిసాన్ పథకం కింద ప్రయోజనాలు అందనున్నాయంటూ వాట్సాప్ ద్వారా మెస్సేజ్ వచ్చింది.

మొదట కాస్త అనుమానించినా.. ఉచితంగా డబ్బులు వస్తామంటే ఎవరు మాత్రం కాదంటారు. నిజంగానే వస్తాయేమోనన్న ఆశతో.. మెసేజ్‌లో ప్రామాణికంగా కనిపించే లింక్ క్లిక్ చేశాడు. ఇంకేముంది.. ఆ సైబర్ మోసగాడు పన్నిన ఉచ్చుతో ఈజీగా చిక్కుకుపోయాడు ఆ బాధితుడు. వెబ్‌సైట్‌లో సూచించిన అన్ని సూచనలను అనుసరించాడు. చివరికి తన మొబైల్‌కు వచ్చిన ఓటీపీని కూడా షేర్ చేశాడు. కట్ చేస్తే.. అకౌంట్‌ నుంచి 1.9 లక్షలు మాయమయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన బాధితుడు.. మోసపోయినట్టు తెలుసుకుని వెంటనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్ మోసాల ఉచ్చులో పడకుండా ఉండాలంటే..

మొబైల్స్‌కు వచ్చే లింకులు ప్రామాణికతను ధ్రువీకరించాలి.. pmkisan.gov.in లేదా india.gov.in వంటి అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లతో సందేశాలు లేదా లింక్‌లను ఎల్లప్పుడూ క్రాస్ చెక్ చేసుకోవాలి.

ధ్రువీకరించని లింక్‌లను క్లిక్ చేయొద్దు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవిలకు సంబంధించిన లింకుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఓటీపీలను అత్యంత గోప్యంగా చూడాలి. పంపినవారు విశ్వసనీయ సంస్థకు చెందిన వారని క్లెయిమ్ చేసినప్పటికీ.. ఓటీపీని చేప్పాలని ఏ ఒక్క సంస్థ అడగదు.

ఏదైనా మోసం జరుగుతుందని అనుమానించినట్లయితే.. వెంటనే స్థానిక పోలీసు, సైబర్ క్రైం సెల్ లేదా సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in)కి ఫిర్యాదు చేయాలి.

ఆన్‌లైన్ మోసగాళ్ల నుంచి మీ ఆర్థిక మరియు వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచడంలో సమాచారం, అప్రమత్తంగా ఉండటానతి సహాయపడుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment