మంథని: సైబర్ క్రైమ్ కేసు నమోదు.. నిందితుల రిమాండ్
మంథని, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:- పెద్దపల్లి జిల్లా మంథని మండలం ధర్మారం (గద్దలపల్లి) గ్రామానికి చెందిన కందుకూరి లక్ష్మి తన కుమారుడు చనిపోగా కుమారుని అకౌంట్లో ఉన్నటువంటి 4,49,000 రూపాయలను తేదీ 25.04.2024 రోజున లక్ష్మి తన SBI అకౌంట్ లోకి బదిలీ చేయించుకుంది. తరువాత తేదీ 04.09.2024 రోజున లక్ష్మి అట్టి డబ్బులను డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళ్లగా ఆమె అకౌంట్లో డబ్బులు లేవని బ్యాంకు వారు తెలుపగా ఆమె మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినది.
ఇట్టి కేసు విచారణ అధికారి అయిన మంథని సీఐ బి రాజు బ్యాంకు స్టేట్మెంట్ లు, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నిందితులను గుర్తించగా నిందితులు అయినటువంటి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ కు చెందిన దామరకుంట అశోక్ ( 34 ), గుండ్ర ప్రశాంత్ కుమార్ ( 28 ) ఇద్దరు కలిసి సులభంగా డబ్బులు సంపాదించడం కోసం బాధితురాలు లక్ష్మీ అకౌంటు నెంబర్ ను మొదటి నిందితుడైన అశోక్ ఫోన్ నెంబర్ కు ఉన్నటువంటి పేటీఎం యాప్ కు అనుసంధానం చేశాడు. ఫిర్యాదుదారు అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు డ్రా చేసుకొని వారి జల్సాలకు, కుటుంబ అవసరాలకు వాడుకున్నారని, నిందితులు వారు చేసిన నేరాన్ని ఒప్పుకోన్నారు. వారిని తేదీ 13.03.2025 రోజున అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్ కు తరలించారని మంథని సీఐ బి. రాజు పేర్కొన్నారు.
ఎవరికి ఓటీపీలు చెప్పవద్దని, లింకులను ఓపెన్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దని, ఎవరైనా సైబర్ మోసాలు గాని లేదా ఇతర మోసాలు చేసినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.