కేసీఆర్‌ ప్రతిష్టను దెబ్బతియాలనే కుట్రతోనే నోటీసులు…ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కేసీఆర్‌ ప్రతిష్టను దెబ్బతియాలనే కుట్రతోనే నోటీసులు…ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

రాజకీయ కక్షతో కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోతున్నామని ఎంత బాధ పడ్డామో అందరికీ తెలుసన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్‌ గారు కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్‌ పార్టీ వాళ్లకు మొదటి నుంచి కడుపు మంటగా ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తెలంగాణ బాగుపడటం, పేదలు బాగుపడటం కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పుడూ ఇష్టం ఉండదన్నారు. ప్రజలు ఎప్పటికీ పేదరికంలో ఉంటేనే తమకు పదవులు వస్తాయని భావించే నాయకత్వం కాంగ్రెస్‌ పార్టీది అని మండిపడ్డారు.

కేసీఆర్‌ గారు తెలంగాణలో బీడు భూములన్నింటికీ నీళ్లు వచ్చేలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మొదటి నుంచి కుట్రలు పన్నుతూ అనేక కేసులు వేసిన విషయం కూడా ఈ సందర్భంలో మనం గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అదే కుట్రలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్లు రావడం.. ఆ వెనువెంటనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌డీఎస్ఏ అధికారులు పడవల్లో వచ్చి ఫొటోలు తీసి ప్రచారం చేసిన విషయం కూడా అందిరికీ తెలిసిందేనన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రజలందరినీ కన్ఫ్యూజన్‌ కు గురి చేశారని అన్నారు. ఈ కుట్రలో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్‌ ను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి తన జీవితాన్ని పణంగా పెట్టిన కేసీఆర్ గారిపై కాంగ్రెస్ చేస్తోన్న కుట్రల్లో భాగంగానే కేసీఆర్ గారికి నోటీసులు అందజేశారని అన్నారు.

తెలంగాణ ప్రజల కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఆమరణ నిరాహార దీక్ష చేసిన నాయకుడు కేసీఆర్ గారు అని గుర్తు చేశారు. కేసీఆర్‌ గారి ప్రతిష్టను, ఆయన పేరును దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి కమిషన్లు ఏర్పాటు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల కోసం నిర్మించిన ప్రాజెక్టు అన్న విషయం గుర్తించాలన్నారు. రాజకీయ కుట్రతో, కక్షతో వేసిన ఇలాంటి కమిషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్నే గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే నిజాలన్ని బయటకు వస్తాయని.. పాలు ఏవో.. నీళ్లు ఏవో ప్రజలకు స్పష్టత వస్తుందని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment