గత పది సంవత్సరాల కాలంలో గత పాలకులు, బాసర త్రిబుల్ ఐటీ ని భ్రష్టు పట్టించారని, ఇకనైనా త్రిబుల్ ఐటీ పై దృష్టి సారించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కకు సూచించారు. శుక్రవారం మంత్రి సీతక్క త్రిబుల్ ఐటీ లో అధికారులతో సమీక్షించిన సందర్భంగా మాట్లాడారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూలంగానే త్రిబుల్ ఐటీ ఏర్పాటయిందని ఆయన సేవలను ఇక్కడి ప్రాంతవాసులు ఎన్నటికీ మర్చిపోరన్నారు.ఏడు కోట్ల రూపాయలతో నాలుగు సంవత్సరాల క్రితం సోలార్ ప్లాంట్ ఏర్పాటు అయితే, ఇప్పటికీ ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. పాలన విభాగంలో కిందిస్థాయి అధికారులతో పనులు చేయించడం సరికాదన్నారు. త్రిబుల్ ఐటీ అభివృద్ధికి 50 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని కోరారు. విద్యార్థులకు మినీ స్టేడియం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. త్రిబుల్ ఐటీకి తాను స్వయంగా పలుమార్లు వచ్చి పరిశీలించాలని , వాష్ రూమ్ లతోపాటు పలు సౌకర్యాలు లేవన్నారు.
ట్రిబుల్ ఐటి అవకతవకలపై విచారణ జరిపించండి…..
గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో బాసర ట్రిబుల్ ఐటీ లో అవకతవకలు జరిగాయని వాటిపై విచారణ జరిపించాలని విద్యార్థులు మంత్రి సీతక్కకు తెలియజేశారు. విచారణ జరిపి అక్రమాలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలన్నారు. త్రిబుల్ ఐటీ భ్రష్టు పట్టడానికి కారణం అప్పటి పాలకులేనన్నారు. 9000 మంది విద్యార్థులు ఉన్నారని సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. రిజిస్ట్రార్,అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. అయితే ఈ సమావేశంలో విద్యార్థులు గత పాలకులు అని మాటిమాటికి అనడం మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అక్కడే ఉండడం కొస మెరుపు.
సమస్యలను పరిష్కరిస్తా మంత్రి సీతక్క…
త్రిబుల్ ఐటీ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. త్రిబుల్ ఐటీని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచనల ను పరిగణలోకి తీసుకొని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు లక్ష్య సాధన తో చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నారు. సమావేశంలో కలెక్టర్ తో పాటు త్రిబుల్ ఐటీ అధికారులు పాల్గొన్నారు.