స్పామ్ కాల్స్ను నిరోధించేందుకు రంగం సిద్ధం!
స్పామ్ కాల్స్ (మోసపూరిత, అవాంచిత కాల్స్)ను నిరోధించేందుకు రంగం సిద్ధమవుతుంది. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు ? అనే కాలర్ ఐడీ సమాచారాన్ని టెలికామ్ సర్వీసు ప్రొవైడర్ సంస్థలే మొబైల్ స్ర్కీన్పై చూపెట్టబోతున్నాయి.
ప్రస్తుతం ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ల సాయంతో మొబైల్ వినియోగదారులు ఈ కాలర్ ఐడీ సేవలు పొందుతున్నారు. ఇకపై, ఇలాంటి యాప్లు అవసరం లేకుండానే కాల్ నేమింగ్ ప్రెజెంటేషన్(సీఎన్ఏపీ) సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు హెచ్పీ, డెల్, ఎరిక్సన్, నోకియా తదితర సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దశలవారీగా సీఎన్ఏపీ సేవలను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చే పనిలో ఉన్నాయి.
అయితే, ఈ సీఎన్ఏపీ సేవలు ప్రస్తుతానికి ఏ నెట్వర్క్కు ఆ నెట్వర్క్ పరిధికే పరిమితం కానున్నాయి. ఎయిర్టెల్ వినియోగదారుడు.. మరో ఎయిర్టెల్ నెంబర్కు ఫోన్ చేస్తే.. కాల్ చేసింది ఎవరు ? అనే సమాచారం కనిపిస్తుంది. ఎయిర్టెల్ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం మొబైల్ స్ర్కీన్పై పేరు డిస్ప్లే అవుతుంది. అదే, ఎయిర్టెల్ వినియోగదారుడు జియో లేదా వీఐ నెంబర్కు ఫోన్ చేస్తే ఆ వ్యక్తి కాలర్ఐడీ జియో లేదా వీఐ వినియోగదారులకు కనిపించదు. టెలికామ్ ప్రొవైడర్లు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తేనే సీఎన్ఏపీ సదుపాయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.