తెలంగాణ ఉద్యమ ప్రతిబింబం ‘విజయ తెలంగాణ”
వేలాది మంది యువకులు, విద్యార్థుల త్యాగాలు, సబ్బండ వర్ణాల మద్దతుతోనే తెలంగాణ ఉద్యమం విజయవంతమైందని, అలాంటి ఉద్యమ చరిత్రను ఏ కొందరు వ్యక్తులో తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించినప్పుడు, నిజంగా త్యాగాలు చేసిన సిసలైన ఉద్యమకారులకు సంబంధించిన చారిత్రక వాస్తవాలను లిఖించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రజల కోణాన్ని ఆవిష్కరించిన పుస్తకం ‘విజయ తెలంగాణ’ అని, ఇలాంటి రచనలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
మలి దశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ యోధుడు, మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ రచించిన ‘విజయ తెలంగాణ’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి పొన్నం ప్రభాకర్ , రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ , ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు..
“వ్యక్తిగతంగా నేను చాలా అభిమానించే నాయకుల్లో దేవేందర్ గౌడ్ అగ్రస్థానంలో ఉంటారు. విజయ తెలంగాణ వారి స్వీయ చరిత్ర కాదు. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజల కోణంలో పొందుపర్చిన పుస్తకం ఇది.
ఉద్యమ చరిత్రను కొంత మంది తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువకుల త్యాగాలను చరిత్రగా లిఖించాలని మరోసారి కోరుతున్నాను.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేవేందర్ గౌడ్ ఆ నాడు తీసుకున్న నిర్ణయాలు, చేసిన పోరాటాలు సాహసోపేతమైనవి. గోదావరి జలాల తరలింపు కోసం దేవేందర్ గౌడ్ ఆ నాడు చేసిన పాదయాత్ర ఫలితంగానే ‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు’కు ఆమోదం లభించింది. తెలంగాణ అంటే టీజీ అని రాయించింది దేవేందర్ గౌడే. ఉద్యమంలో యువకులు బండ్ల పైనే కాదు, గుండెలపైనా టీజీ అని రాసుకున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం రాగానే టీఎస్ ను టీజీ గా మార్చాం. రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత జయ జయహే తెలంగాణ పాటను అధికారిక గీతంగా గుర్తించడంగానీ, తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేసిన 9 మంది ఉద్యమకారులకు ఇంటి స్థలం, ఆర్థిక సహాయ ప్రకటన వంటి నిర్ణయాలు ప్రజలు కోరుకున్న విధంగానే తీసుకున్నాం. దేవేందర్ గౌడ్ లాగా విలువలతో కూడిన నాయకుల సంఖ్య తెలంగాణ రాజకీయాల్లో పెరగాల్సిన అవసరం ఉంది” అని ముఖ్యమంత్రి అన్నారు.