దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార గడువు ముగిసే చివరి క్షణం వరకూ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరెత్తించారు. మూడోసారి అధికారంలోకి రావాలని ఆప్, ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనని బీజేపీ హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. ఈసారి ప్రతి చోటా పది శాతం అధికంగా ఓట్లు పెరిగేలా చూడాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సీఈసీ రాజీవ్ కుమార్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు ఢిల్లీలో నిన్న బీజేపీ మొత్తం 22 రోడ్షోలు నిర్వహించింది. ఢిల్లీ నుంచి ఆపద ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రధాని మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో కొందరు విద్యార్థులతో ముచ్చటించిన ఆయన ఆప్ విద్యావిధానంపై విమర్శలు గుప్పించారు. గ్యారంటీగా పాస్ అవుతారనుకునే విద్యార్థులనే పదో తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతించి మిగతా వారిని అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం పరువు పోతుందని విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం తగదన్నారు. ఆప్ పాలనలో ఢిల్లీకి దక్కింది చెత్త, విషపు నీరేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. తమకు అధికారమిస్తే ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు. కుంభకోణాల ఆప్ సర్కారును సాగనంపి వికసిత్ ఢిల్లీ కోసం బీజేపీకి పట్టం కట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓటర్లకు పిలుపునిచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.
Published On: February 4, 2025 10:10 am
