పశు వైద్య విశ్వవిద్యాలయ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

పశు వైద్య విశ్వవిద్యాలయ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

చీపురుపల్లి, మార్చి 07, సమర శంఖం ప్రతినిధి:- గరివిడి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు ఇచ్చే స్టై ఫండ్ పెంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.

గత కొద్ది రోజులుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం దశ దశలుగా పోరాటం నిర్వహిస్తున్న వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ విద్యార్థుల పోరాటానికి భారత విద్యార్థి ఫెడరేషన్ శుక్రవారం సంపూర్ణ మద్దతు తెలియజేసింది. వారి డిమాండ్ల సాధనకు ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేష్ విద్యార్థులకు మద్దతు తెలుపుతూ వారితో మాట్లాడారు.

గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యాల ఫలితంగా వెటర్నరీ విద్యార్థులు వీధిన పడ్డారని విమర్శించారు. అన్ని ఆరోగ్య సంబంధిత విద్యారంగాల్లో పీజీ, పి హెచ్ డి విద్యార్థులకు రూ.25 వేల నుంచి 65 వేల వరకు స్టై ఫండ్ ఇస్తున్నారని, వెటర్నరీ విద్యార్థులకు కేవలం రూ .ఏడు వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. పశువుల రక్షణలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పశువైద్య విద్యార్థులకు కూడా అధిక మొత్తంలో స్టైఫండ్ ఇచ్చి వారి విద్యకు తోడ్పడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .

ఈ జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యపై పోరాటం జరుగుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. గతంలో హామీ ఇచ్చిన మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం త్వరితగతిన పరిష్కారం చేయని యెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పోరాటం ఉదృతం చేస్తామని దీనికి రాష్ట్ర విద్యా యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎం వెంకీ, జిల్లా సహాయ కార్యదర్శి ఈ వంశీ, జిల్లా కమిటీ సభ్యుడు సి హెచ్ రమణ, చీపురుపల్లి మండల కమిటీ సభ్యులు మధు, జగదీష్, నాని, నీలిమ, చైతన్య, సాయి, శ్రీలత లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment